26/11 ముంబయి ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబయిని తలపించే ఆరు సెట్లను రూపొందించారు. ఆనాటి ముంబయి దాడులకు కేంద్ర ప్రాంతాలుగా నిలిచిన గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ను పునఃసృష్టిస్తూ హైదరాబాద్లో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా భారీ సెట్లను తీర్చిదిద్దారు. ఐదొందల మంది దాదాపు పదిరోజుల పాటు శ్రమించి ఈ సెట్స్ను నిర్మించారు. నాలుగైదు రోజుల పాటు చిత్ర బృందం ముంబయిలోని తాజ్ప్యాలెస్ హోటల్ను..అందులోని ఆర్కిటెక్చర్ను పరిశీలించి సెట్స్కు రూపకల్పన చేశారు. ఈ సెట్ ఓ ప్రాపర్టీలా కాకుండా సినిమాలో ఓ క్యారెక్టర్లా ఉంటుందని చిత్రబృందం తెలిపింది.