హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అనాథనంటూ సానుభూతి పొందుతుంది. ప్రేమ పేరుతో వలవేస్తుంది. పెండ్లి చేసుకుంటుంది. ఆపై డబ్బు, నగలతో పరారవుతున్న మాయలేడి అసలు రూపం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మూడో పెండ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె మోసం వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన 20 ఏండ్ల యువకుడికి తిరుపతిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఎం సుహాసినితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. తాను అనాథనని యువకుడికి చెప్పడంతో అతడు కుటుంబసభ్యులను ఒప్పంచి డిసెంబర్లో పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు 8 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు ఇచ్చాడు. యువకుడి తండ్రి నుంచి సుహాసిని మరో రూ.2 లక్షలు తీసుకున్నది. ఈ విషయంపై భర్త నిలదీయడంతో ఈ నెల 7న ఇరువురి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజునుంచి సుహాసిని కనిపించకుండా పోయింది.
ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో ఆధార్కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలేనికి చెందిన వ్యక్తితో ఆమెకు పెండ్లి జరిగి ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు తెలిసింది. అదే సమయంలో సుహాసిని.. ఆ యువకుడికి ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్నానని, త్వరలో డబ్బు ఇచ్చేస్తానని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదుచేస్తే చిక్కుల్లో పడుతావని బెదిరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెండ్లి చేసుకున్న ఫొటోలను కూడా పంపించింది. దీంతో ఆ యువకుడు తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు, సుహాసిని బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తనను రెండో పెండ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు. అనాథనని పెండ్లి చేసుకుని రూ.15 లక్షల నగదు, నగలతో పరారైనట్టు వెల్లడించారు. మొదటి భర్త, బావ అయిన వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. సుహాసినిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.