నల్లగొండ : జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామ పంచాయతీ ఆవాసగ్రామం మాలగూడెంలో ఆదివారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తికి ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న వీరంతా తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు శనివారమే గ్రామానికి చేరుకున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజామున లక్ష్మయ్య ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో ఆనందాలు పంచుకుంటూ సంతోషాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అంత్యక్రియలప్పుడు తమ సోదరుడికి చివరిసారిగా రాఖీలు కట్టి కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. ఈ ఘటన గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది.