హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ సింగరేణి మంచి పనితీరు కనబర్చింది. గతేడాది మే నెలతో పోల్చుకొంటే, ఈ ఏడాది మే నెలలలో బొగ్గు ఉత్పత్తి, రవణా, టర్నోవర్లో గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. 2021 మే నెలలో 54.4 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 32.2 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. బొగ్గు ఉత్పత్తి విషయంలో గతేడాది మే నెలతో పోల్చుకొంటే ఈ ఏడాది మే నెలలో 69 శాతం వృద్ధి నమోదైంది. బొగ్గు రవాణాలోనూ 127 శాతం వృద్ధి సాధించింది. 57.9 లక్షల టన్నుల బొగ్గును రవాణాచేసింది. బర్డెన్ తొలగింపు విషయంలో 21 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన నెలలో 35.43 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించింది. మొత్తంగా టర్నోవర్లో 88 శాతం వృద్ధి నమోదయ్యింది.
గతేడాది మే నెలలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్తు ద్వారా రూ.1,181 కోట్ల అమ్మకాలు జరగగా, ఈ ఏడాది మే నెలలో 88 శాతం వృద్ధితో రూ.2,221 కోట్లకు పెరిగినట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. ఇది శుభ పరిణామమని, ఇదే వేగంతో మిగిలిన నెలల్లో పనిచేసి, నిర్దేశిత వార్షిక లక్ష్యం 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చారు. గురువారం ఆయన సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో నెలవారీ ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఏప్రిల్, మే నెలల్లో మంచి వృద్ధిని కనపర్చిన మణుగూరు ఏరియాకు అభినందనలు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయించినట్టు తెలిపారు మిగిలినవారికి ఈ నెలాఖరుకల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, ఈడీ అల్విన్, అడ్వైజర్ ప్రసాద్, సురేంద్రపాండే, జీఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.