హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణి కుటుంబసభ్యులందరి ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నదన్న విషయాన్ని ప్రతి అధికారి గుర్తించాలని, ఆ మేరకు కార్మికులందరికీ భరోసా కల్పించాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. కొవిడ్ కట్టడి చర్యలు పటిష్టంగా చేపట్టాలని, ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కువ టెస్టుల ద్వారా రోగులను గుర్తించి వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని, ఇందుకు మరో 50 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సిద్ధంచేయాలని సీఎండీ ఆదేశించారు. కొవిడ్ నివారణ ఇంజక్షన్లు, మందులు మరో రెండు నెలలకు సరిపడా ఏరియా దవాఖానల్లో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అంబులెన్సులు సరిపోకపోతే.. తక్షణమే ప్రైవేటు అంబులెన్స్లను ఏర్పాటుచేసుకోవాలని, అవసరాన్ని బట్టి ఏరియాలవారీగా డాక్టర్లు, నర్సులు, వార్డుబాయ్స్, టెక్నీషియన్లను నియమించుకోవాలని సూచించారు. సింగరేణిలోని 11 దవాఖానల్లో రోజుకు కనీసం 200 మందికి వ్యాక్సిన్ వేయాలని, మే చివరికల్లా మొదటి డోసు, జూలై చివరినాటికి రెండోడోసు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. సింగరేణివ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 700 పడకలకు అదనంగా మరో 500 పడకలను సమకూర్చుకోవాలని, తగినంత ఆక్సిజన్ను అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడికక్కడ ఆక్సిజన్ ఫిల్లింగ్ను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూములను ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.