సంగారెడ్డి : అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, శ్మశానవాటికలు ఆరునెలల్లో పూర్తిచేయాలని చెప్పారు. రైతు వేదికలను ఎలా వేగంగా పూర్తి చేశామో..అదేరీతిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు.
అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా పాఠశాలలు, గుడులు, మసీదులు, చర్చిలు, వైకుంఠథామాలకు, రైతు వేదికలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
ఇంకా కొన్ని గ్రామాలకు నీరందడం లేదని ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని మంత్రి అధికారుల దృష్టికి తెచ్చారు.
కొన్ని చోట్ల రోడ్ల పనుల కారణంగా నీరు సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. ఆర్అండ్బీ, ఎన్హెచ్ అధికారులతో సమన్వయంతో అన్నిగ్రామాలకు తాగునీరు ఇవ్వాలని ఆదేశించారు.
సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్, తెల్లాపూర్, పఠాన్చెరు, నారాయణ ఖేడ్, సదాశివపేట్ మున్సిపాలిటీల మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆరునెలల్లో మార్కెట్లు, వైకుంఠథామాలు పూర్తి చేయాలని సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి చెప్పారు.