ఆయనతో ఎస్సీ వర్గీకరణ అసాధ్యం: పిడమర్తి
ఖైరతాబాద్, జూలై 6: ఇరవై ఐదేండ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మాటలతో మభ్యపెట్టిన మందకృష్ణ సిల్వర్జూబ్లీ పూర్తి చేసుకున్నాడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గోల్డెన్, డైమండ్ జూబ్లీలు అయినా ఆయనతో వర్గీకరణ సాధ్యంకాదని తేల్చిచెప్పారు. మందకృష్ణ నాయకత్వాన్ని నమ్ముకుంటే ఎన్ని దశాబ్దాలైనా మాదిగలకు న్యాయం జరగదని స్పష్టంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. మందకృష్ణ ఉదయం విమర్శలు చేస్త్తూ, రాత్రి చీకటి ఒప్పుందాలు చేసుకుంటారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, 12 శాతం రిజర్వేషన్ల డిమాండ్తో ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మాదిగ సంఘాలతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఉత్తమ్కుమార్రెడ్డి నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్లో మాదిగలకు స్థానం ఇవ్వలేదని, ప్రస్తుత రేవంత్రెడ్డి కూడా తన పీసీసీలో స్థానం కల్పించకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. సమావేశంలో అంబేద్కర్ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ్రావు, మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గడ్డ యాదయ్య, మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి కృష్ణ, నరేశ్, సురేశ్, మైస ఉపేందర్, చిరుమర్తి రాజు పాల్గొన్నారు.