హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రైతులు విత్తనాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా.. ఏ దుకాణాల్లోనో కొనుగోలు చేయకుండా.. తమ ప్రాంత పరిధిలోనే అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైతు వేదికలు ఇలాంటి ప్రయోగాలకు నాంది పలుకుతున్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలోని రైతు వేదిక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నది. సీడ్బ్యాంక్గా అవతరిస్తున్నది. ఈ క్లస్టర్ పరిధిలో రైతులు పండించిన పంటల నుంచి మేలిమి విత్తనాలను సేకరించి, సీడ్బ్యాంక్ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే 38 రకాల విత్తనాలను గుర్తించారు. ఇందులో దేశవాళీ రకాలు 22 ఉండగా, వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసినవి మరో 16 రకాలున్నాయి. నాలుగైదు రోజుల్లో ఈ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్టు క్లస్టర్ ఏఈవో నాగార్జున తెలిపారు. రైతులు పండించిన విత్తనాలను ఒకరి నుంచి మరొకరికి అందించే లక్ష్యంతో సీడ్బ్యాంక్లను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. నారాయణరావుపేట క్లస్టర్ పరిధిలో కొంతమంది రైతులకు విత్తనాభివృద్ధిపై అవగాహన కల్పించి, సీడ్ ప్రొడక్షన్ చేయించారు. ఆయా రైతులు పండించిన విత్తనాలతోపాటు మరికొన్ని ఇతర విత్తనాలను సీడ్ బ్యాంక్లో ఉంచనున్నారు. విత్తనాల ఎంపికలో ప్రస్తుతం అత్యధికశాతం రైతులు అనుసరిస్తున్న విధానం పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తున్నది. దీంతో రైతులకు కొత్త విత్తనాలపై అవగాహన కల్పించడం, వాటిని వారికి అందుబాటులో ఉంచే లక్ష్యంతో సీడ్ బ్యాంక్ను నెలకొల్పుతున్నారు.
ఒకప్పుడు సాగునీరు లేక కరువుతో అల్లాడిన సిద్దిపేట జిల్లా ఇప్పుడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారింది. నాడు తినడానికి సరిపడ పంటలు పండని ప్రాంతం ఇప్పుడు విత్తనాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధపెట్టి రైతులను విత్తనాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. గత యాసంగిలో దాదాపు 20వేల ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలను ఉత్పత్తిచేశారు. ఇందు లో 250 ఎకరాల్లో శనగ విత్తనాలను ఉత్పత్తి చేశారు. ఇందుకు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరిపి.. విత్తనాభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ పండించే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కూడా కొనుగోలు చేస్తుండటం విశేషం.
ఇష్టారీతిన కాకుండా డిమాండ్ ఆధారంగా పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విత్తనోత్పత్తి వైపు మళ్లిస్తున్నాం. గత యాసంగిలో 20 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేశాం. వచ్చే యాసంగిలో మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
శ్రవణ్కుమార్, డీఏవో సిద్దిపేట