మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం
తొలిసారిగా మేయర్ బాధ్యతలు స్వీకరించనున్న మహిళా కార్పొరేటర్
హాజరుకానున్న పార్టీ పరిశీలకులు మంత్రి వేముల, నూకల నరేశ్రెడ్డి
ఖమ్మం, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పీఠంపై వరుసగా రెండోసారి గులాబీ జెండా ఎగిరింది.. మేయర్ పదవి ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. టీఆర్ఎస్కు చెందిన మహిళా కార్పొరేటర్ తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి..? అదృష్టం ఎవరింటి తలుపు తట్టనున్నది. అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే, అధిష్ఠానం ఎవరి పేరు ప్రతిపాదించినా తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని టీఆర్ఎస్ కూటమి
కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.,
నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన ఖమ్మానికి 2016లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మేయర్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వు అయింది. టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన డాక్టర్ గుగులోత్ పాపాలాల్ తొలి మేయర్ పదవిని చేపట్టారు. ఈ దఫా మేయర్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వు అయింది. వరుసగా రెండోసారి ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ తొలి మేయర్గా పదవిని అధిష్ఠించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 43 మంది కార్పొరేటర్లు తీర్మానం చేశారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను అధిష్ఠానం ఎంపిక చేయనుంది. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులుగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి హాజరుకానున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటికి కేవలం రెండు పర్యాయాలు మాత్రమే మహిళలు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ అప్పినేని నాగమల్లిక ఒక దఫా మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించగా.. సీపీఎంకు చెందిన అఫ్రోజ్ సమీనా మరో దఫా మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు.
మేయర్ పీఠంపై తొలిసారి మహిళ
ఇక మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత మేయర్ పదవిని మహిళ అధిష్ఠించనుండడం ఇదే తొలిసారి. ఈ పదవి ఎవరిని వరిస్తుందోనన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్కు కేఎంసీలో పూర్తి మెజార్టీ ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పార్టీ పరిశీలకులుగా నియమితులైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి శుక్రవారం ఖమ్మం చేరుకుంటారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో నగరపాలక సంస్థలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు, కో ఆప్షన్ సభ్యుల పదవులను దక్కించుకునే పూర్తి మెజార్టీని సాధించింది. శుక్రవారం జరిగే ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఖమ్మం అదనపు కలెక్టర్ మధుసూదన్రావు అధ్యక్షత వహించనున్నారు. తొలుత కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లతో అధికారులు పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొవిడ్ కారణంగా ప్రమాణస్వీకారానికి నేరుగా హాజరుకాలేని కార్పొరేటర్లతో వీడియో కాల్ ద్వారా ప్రమాణం చేయించే వెసులుబాటు కల్పించారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరాన్ని అధికారులు ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో..
ఖమ్మం మే 6: కేఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహణకు మున్సిపాలిటీ చట్టం-2019 ప్రకారం అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్రావును నియమిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఖమ్మానికి చేరుకున్నమంత్రి వేముల
కేఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు టీఆర్ఎస్ ఇన్చార్జిగా నియమితులైన రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి గురువారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు. వారికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, ఆర్అండ్బీ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.