సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. సిద్దిపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కూడవెల్లి సంతోష్, మురాం భాను వరద నీటిలో చిక్కుకున్నట్లు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తమ బృందంతో అక్కడికి చేరుకుని కారులో ఉన్న సంతోష్, భానును ప్రాణాలతో రక్షించారు. వీరిద్దరిని సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వరద ఎక్కువగా ఉండటంతో ఆ మార్గంలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు.