రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి బయల్దేరితే.. కొద్ది దూరంలో శామీర్పేట చెరువు.. జీనోమ్వ్యాలీ.. అక్కడికి దగ్గరలోనే పర్యాటక కేంద్రంగా రూపుదాల్చుతున్న జల సోయగాల కొండపోచమ్మ రిజర్వాయర్! దానికి దగ్గరలోనే వర్గల్ సరస్వతి ఆలయం.. ఆపై హార్టికల్చరల్ యూనివర్సిటీ! అక్కడికి దగ్గరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం! అది దాటితే.. మల్లన్నసాగర్ మహాజలాశయం.. దాన్ని చూసేలోపే పలుకరించే సిద్దిపేట కలెక్టరేట్ సముదాయం! ఇలా వెళుతున్న కొద్దీ ప్రతి 15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం! అది పర్యాటకమో.. ఆధ్యాత్మికమో? పంటలకు జీవంపోసే జలాశయమో.. ఏదైతేనేం అన్నీ తెలంగాణలోని జాగలకు విలువను అమాంతం పెంచేసేవే! ఇప్పుడు తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడుతున్నదంటే.. ఈ ఆకర్షక కేంద్రాల వల్లే. రాజధానికి 150 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో తక్కువలో తక్కువ 20 లక్షలు లేందే ఎకరం కూడా దొరికే పరిస్థితి లేదు!
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వస్తే ఏమైతది? అని వెక్కిరించినవాళ్లకు.. తెలంగాణ వస్తే ఆగమైతదని లేనిపోని భయాలు సృష్టించినవాళ్లకు చెంప ఛెళ్లుమనిపించేలా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అందనంత ఎత్తుకు ఎదిగింది. ప్రతి ఒక్కరూ ఈర్ష్య పడేలా రియల్రంగం దేదీప్యమానమైంది. ఆరేండ్లలోనే భూముల ధరలు సగటున రెండున్నర రెట్లు పెరిగాయి. ఈ ట్రెండ్ ఒక్క హైదరాబాద్కో.. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. వ్యవసాయ భూములు బంగారంలా మారగా, ప్లాట్లు, ఇండ్లు పెట్టుబడికి కేంద్రాలయ్యాయి. తెలంగాణలో భూమికి అసలైన ధర ఇప్పుడే వస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనాదక్షత, ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్య వృద్ధిని సాధిస్తున్నది. జాతీయ సగటును మించి ఆర్థికవృద్ధిని నమోదుచేస్తున్నది. ఫలితంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో అడుగుపెడుతున్నాయి. గత ఆరేండ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణం వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై కొండపోచమ్మసాగర్ వరకు గోదారమ్మను మోసుకొచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేయడంతో కనెక్టివిటీ పెరిగింది. ఔటర్కు వెలుపల రీజినల్ రింగ్ రోడ్డు, అన్ని నగరాలు, పట్టణాలకు ఔటర్ రింగ్రోడ్లు నిర్మిస్తుండటం కలిసి వస్తున్నది. పరిశ్రమలను వికేంద్రీకరించింది. ఓవైపు వ్యవసాయం, మరోవైపు వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో భూమి బంగారంతో సమానంగా మారింది. కాబట్టి అదే స్థాయిలో భూముల ధరలు పెరగడం సహజం. పెట్టిన ప్రతి రూపాయికీ కచ్చితంగా ఫలితం వస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ఈ పరిణామాలతో తెలంగాణలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. స్థిరంగా ధరలు పెరుగుతూ ఉండటం వల్ల కొనుగోలుదారులకు సైతం వేగంగా లాభాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా ఎవరైనా భూమి లేదా ఇల్లు కొనే ముందు సమీపంలో ఏదైనా బడి లేదా గుడి లేదా ఇతర పర్యాటక ప్రాంతం, పరిశ్రమ, ప్రభుత్వ కార్యాలయం, హైవే వంటివి ఏమైనా ఉన్నాయేమోనని చూస్తారు. వీటినే పెట్టుబడి ఆకర్షక ప్రాంతాలుగా పిలుస్తారు. గతంలో నగరాలు, పట్టణాల చుట్టూనే ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక ప్రాంతం తయారైంది. కొత్తజిల్లా కేంద్రాలు ‘రియల్’ కేంద్రాలుగా మారాయి. వెంచర్లు పెరుగుతున్నాయి. సమీకృత కలెక్టరేట్ల చుట్టూ ఉన్న భూములకు, సమీపంలోని గ్రామాలకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు సగటున ప్రతి 15 కిలోమీటర్లకు ఒక మండల కేంద్రం తయారైంది. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక గ్రామాల మధ్య లింక్ రోడ్లను అభివృద్ధి చేయడం, డబుల్ రోడ్లు వేయడం వంటివి కూడా కలిసి వస్తున్నాయి.
గతంలో అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా సాగేది. ఇప్పుడు వికేంద్రీకరణ జరుగుతున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఐటీ రంగం సైతం జిల్లాలకు తరలివెళ్తున్నది. దీంతో ఆయా నగరాలకు వెళ్లే దారులు, వాటి చుట్టూ పదుల కిలోమీటర్ల మేర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కాళేశ్వరం జలాలు రావడం, చెరువులు బాగుపడటంతో గ్రామాల్లో వ్యవసాయం బాగా పెరిగింది. దీంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు జవసత్వాలు వచ్చి, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇండ్లకు డిమాండ్ ఊపందుకున్నది. ఇప్పటికే కట్టిన ఇండ్ల ధరలు రెండుమూడురెట్లు పెరుగగా, మరోవైపు కొత్త ఇండ్ల నిర్మాణం జోరు మీదున్నది. ఇతర రాష్ర్టాల కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్న పరిస్థితి. మరోవైపు చిన్న పట్టణాల్లో అపార్ట్మెంట్ సంస్కృతి మొదలైంది. పట్టణాలు, వాటికి అనుకొని ఉన్న గ్రామాల్లో అయితే ఏకంగా కొత్త వెంచర్లు, నెలల రోజుల్లోనే కాలనీలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో భూముల ధరల పెరగుదల ప్రారంభం మాత్రమేనని, ఐదేండ్లలో ఊహించని స్థాయికి చేరుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. సుస్థిర ప్రభుత్వం ఉండటం, సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుండటం రియల్ ఎస్టేట్కు ఇంధనంగా మారాయన్నారు. పుణె, చెన్నై వంటి నగరాల్లో వసతులు మనతో పోల్చితే చాలా తక్కువ. అయినా అక్కడ చదరపు అడుగు రూ.8 వేల వరకు అమ్ముతున్నారు. మన దగ్గర గచ్చిబౌలి వంటి ప్రైమ్ ప్రాంతాల్లో రూ.6,500-7000కు అమ్ముతుండటం గమనార్హం. మనం ధరల స్థిరీకరణ ప్రారంభ దశలో ఉన్నామని, మరో ఐదేండ్లలో రియల్టీ విస్తరణ మరో దశకు పెరుగుతుందని అంటున్నారు.