పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
ఆకట్టుకుంటున్న పల్లెప్రకృతివనం
ఊరంతా పచ్చదనం
రామన్నపేట, జూన్ 6 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెల ప్రగతిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నది. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచింది రామన్నపేట మండలంలోని బోగారం గ్రామం. బోగారంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం లో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా అధునాతన వసతులతో కూడిన బాత్రూంలు, వెయిటింగ్హాల్, రెండు బర్నింగ్ ప్లాట్ఫారాలు, ప్రహరీని నిర్మించారు. నిర్మాణ ప్రదేశం మధ్యలో మైదానాన్ని చదునుచేశారు. రూ. 2.60 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.6లక్షల అంచనాతో చేపట్టిన పల్లెప్రకృతి వనం పనులు పూర్తిచేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ట్రీగార్డ్లను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి వైపు అడుగులు..
గ్రామంలో వైకుంఠధామంతోపాటు పల్లెప్రగతిలో చేపట్టిన డంపింగ్యార్డ్, పల్లెప్రకృతివనం పనులు పూర్తయ్యాయి. గ్రామ నర్సరీని ఏర్పాటు చేశారు. వీటికి తోడు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుధ్యాన్ని, వీధిదీపాల నిర్వహణను మెరుగుపర్చారు. కాలనీల్లో గుంతలను పూడ్చటానికి మొరం పోయించారు. గ్రామస్తులకు కృష్ణా నీటిని సరఫరా చేయించారు. వీధుల్లో మురికి కాలువల నిర్మాణంతోపాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
పంటను ఎండ బెట్టి
ప్రజల దాహార్తిని తీర్చిన సర్పంచ్
వేసవిలో గ్రామంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు సర్పంచ్ అంతటి పద్మారమేశ్ కుటుంబం సాహసోపేతమైన నిర్ణ యం తీసుకున్నది. తన వ్యవసాయ బావి వద్ద నాటు పెట్టి న పొలాన్ని ఎండబెట్టి రెండు బోరు మోటార్ల నీటిని గ్రా మానికి మళ్లించి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు.
ఊరంతా పచ్చదనం
ఆరో విడుత హరితహారంలో భాగంగా బోగారంలో మెయిన్రోడ్డుతోపాటు వివిధ కాలనీలు, లింక్ రోడ్లపై నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. సర్పంచ్ పద్మారమేశ్ ప్రత్యేక చొరవతో రాజమండ్రి తదితర నర్సరీల నుంచి వైవిధ్యమైన ఏపుగా పెరిగే మొక్కలను తెప్పించి నాటించారు. తానే స్వయంగా మొక్కలు ఎండిపోకుండా పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు అందిస్తున్నారు. మెయిన్ రోడ్డుపై నాటిన మొక్కలకు గ్రీన్ ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతో ఏపుగా పెరిగాయి.
పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు
గ్రామంలో పరిశుభ్రత మెరుగుకోసం పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. 30రోజుల ప్రణాళిక ద్వారా గ్రా మంలో పారిశుధ్యాన్నిమెరుగుపరిచారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ఇంటింటి పొడి చెత్త వేర్వేరుగా వేసేలా రెండు బుట్టలను అందించారు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.