కరీంనగర్ : కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని వందల కోట్ల రూపాయాలైనా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలన కాపాడుకుంటాం అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తేల్చిచెప్పారు. హుజురాబాద్ మండలంలో కన్నుల పండువగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ర్ట వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. వచ్చే కల్యాణోత్సవం అయినా కోట్లాది మంది సమక్షంలో జరగాలని ప్రార్థించాను. కరోనా అంతం కావాలని కోరుకున్నా. పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. కరోనా కష్ట కాలంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పారద్రోలాలి. ప్రభుత్వానికి తోడుగా నిలవాలన్నారు. సెకండ్ వేవ్లో గత వారం పదిరోజులుగా కేసులు అధికమవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.