సిద్దిపేట, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటా జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నది. సర్వేలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు పది రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన వారికి మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 666 బృందాలు, మెదక్ జిల్లాలో 547, సంగారెడ్డి జిల్లాలో 1248 బృం దాలు సర్వే చేస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే పూర్తి కానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జర సర్వేపై ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
దేశానికే ఆదర్శం..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. అన్ని రాష్ర్టాల్లో సర్వేను నిర్వహించాలని ప్రధాని మోడీ సూచించారు. ఇంటింటా సర్వే చేపట్టడంతో కరోనాను మొగ్గ దశలోనే ప్రభుత్వం నియంత్రించ గలుగుతున్నది. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హోం ఐసొలేషన్లో ఉంచి, వారికి ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తున్నది. ఇంటింటా జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రజల నుంచి సానుకూల స్పం దన రావడంతో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్వహిస్తున్న సర్వేతో ప్రజల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో 666 బృందాలను ఏర్పాటు చేసి, 100 మందికిపైగా పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,18,204 ఇండ్ల సర్వే పూర్తిచేశారు. ఇంటింటా జ్వర సర్వేలో భాగంగా 8,316 మందికి మెడికల్ హెల్త్ కిట్లు పంపిణీ చేశారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో 547 బృందాలను ఏర్పాటు చేసి 1,71,135 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. ఇప్పటి వరకు 7,405 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. దాదాపు జిల్లాలో సర్వేను పూర్తి చేశారు. మిగిలిపోయిన ఇండ్లు ఉంటే వాటిని సర్వే చేయడానికి బృందాలు వెళ్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 1,248 బృందాలతో 3,13,096 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. 9,690 మందికి మెడికల్ కిట్లను సర్వే బృందాలు అందజేశాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటింటా సర్వే పక్కాగా కొనసాగుతున్నది.
ఇంటింటా జ్వర సర్వేతో సత్ఫలితాలు…
ఇంటింటా నిర్వహిస్తున్న జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వేను రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నది. మెదక్ జిల్లాలో దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇంటింటా సర్వేతో కరోనా లక్షణాలు ఉన్న వారిని ఇట్టే గుర్తించడంతో వ్యాధి తీవ్రత పెరగకముందే వారిని కాపాడగలుగుతున్నాం. ఎలాంటి లక్షణాలు ఉన్నా, వెంటనే వారిని హోం ఐసొలేషన్లో ఉంచి, వారికి కావాల్సిన మందులను ఇవ్వడంతో పాటు వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. మరణాల రేటు, ప్రజలపై ఆర్థిక భారం, కరోనా వ్యాప్తి తగ్గుతున్నది. జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించడంతో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఫలితంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.