వేములవాడ టౌన్, ఆగస్టు 9: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. రాజన్నను దాదాపు 40 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, సుమారు రూ.23 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
రాజన్నకు భారీగా వెండి కానుకలు
రాజన్నకు పెద్దమొత్తంలో వెండి కానుకలు సమకూరుతున్నాయి. 3 టన్నుల 600 కిలోల వెండి నిల్వలు ఉండగా, 1989 నాటికి సమకూరిన 400 కిలోల వెండిని అప్పటి శ్రీశైల దేవస్థానానికి విక్రయించారు. దాదాపుగా 32ఏళ్లుగా సమకూరుతున్న వెండి నిల్వలు ఆలయ అధికారులు బ్యాంకు లాకర్లలో నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్లోని చర్లపల్లి మింట్లో ఇప్పటికే 8 క్వింటాళ్ల 60 కిలోల వెండి శుద్ధి కోసం అందజేశారు. ఇప్పుడు మరో 7 క్వింటాళ్ల 53 కిలోల 330 గ్రాముల వెండిని శుద్ధిచేసేందుకు ఆలయ అధికారులకు అనుమతి ఇచ్చారు. ఇంకా సుమారు 25 కోట్ల విలువచేసే వెండి స్వామివారి ఖజానాలో ఉన్నది.