మానవ అక్రమ రవాణాను కట్టడి చేయాలి: మంత్రి సత్యవతి
హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): మానవ అక్రమ రవాణా కట్టడిలో అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవా ణా కట్టడిలో తెలంగాణ ఉత్తమంగా ఉందని, మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా షీటీమ్స్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కృషిచేసిన అధికారులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళలకు ప్రశంసాపత్రాలు ఇచ్చి సత్కరించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు 35,700 అంగన్వాడీలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక నిర్వాహకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్, యూఎస్ కాన్సులేట్ ప్రతినిధి ఖాదర్ పాల్గొన్నారు. కాగా, మావన అక్రమ రవాణాను గుర్తిస్తే 9440700906 లో లేదా dsp-ahtu-wsw<\@>tspolice. gov.in ద్వారా సమాచారం ఇవ్వాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు విజ్ఞప్తి చేశారు.