బషీరాబాద్, మే 31: తెలంగాణ గురుకులంలో చదువుకున్న ఓ గిరిజన విద్యార్థి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం)లో సీటు సాధించాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచేడ్తండాకు చెందిన రాథోడ్ శంకర్, కమిలిబాయి దంపతులు కూలీ పనులు చేస్తూ కొడుకు రాథోడ్ నరేశ్ను చదివిస్తున్నారు. నరేశ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి వరకు, టెన్త్ వరకు బషీరాబాద్లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు. తాండూరులో ఇంటర్ పూర్తి చేశాడు. సంగారెడ్డిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీలో చేరాడు. తృతీయ సంవత్సరం చదువుతూ ఐఐఎం పరీక్ష రాసి సీటు సంపాధించాడు. ఐఐఎంకు ఏటా 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుండగా కేవలం 5 వేల మందికి మాత్రమే సీటు లభిస్తుంది. ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన గిరిజన పుత్రుడు నరేశ్ ఎంపిక కావడం విశేషం.
దాతల సాయం కోసం..
రాథోడ్ శంకర్, కమిలిబాయి దంపతులు కూలి పనులు చేసి కొడుకును చదివిస్తున్నారు. కష్టపడి చదివిన నరేశ్ ఐఐఎంలో సీటు సాధించాడు. ఇందులో అడ్మిషన్ పొందాలంటే రూ.2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆర్థిక స్థోమతలేని తల్లిదండ్రులు సరస్వతీ పుత్రుడిని ఉన్నత చదువులు చదివించే దారి లేక సతమతమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ కొడుకును ఐఐఎంలో చేర్పిస్తామని వారు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలిచిన వారు 7659886842 నంబర్కు గూగుల్పే లేదా ఫోన్పే చేయాలని విజ్ఞప్తి చేశారు.