మహబూబాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు సేవలందించే ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా వ్యయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే కొత్తగా వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం మరింత బలపడుతుందన్నారు.