హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)ః మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలుచేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి అవాసంలో కనీసం ముగ్గురు నుంచి ఐదుగురిని ఇందుకోసం ఎంపికచేశారు. 20 వేలకు పైగా గ్రామ పంచాయతీలు, అవాసాల్లో 62 వేల మందిని ఎంపికచేశారు. వారు ఏర్పాటుచేసే వ్యాపారాలకు సంబంధించి అవసరమైన శిక్షణఇస్తారు. గ్రామాల్లో మారిన పరిస్థితులు, గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా అందుబాటులో లేని వ్యాపారాలు పెట్టేలా ప్రొత్సహించాలని నిర్ణయించారు. వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాల ఇప్పిస్తారు. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇప్పిస్తారు. ఎక్కువ మొత్తంలో రుణం అవసరమైతే ముద్ర రుణాలను ఇప్పించాలని నిర్ణయించారు. వాళ్లు చేసే వ్యాపారాలకు అనుగుణంగా రుణం ఇస్తారు. ఆ గ్రామాల్లో లేని వ్యాపారాలు, స్థానికంగా అవసరాలు తీర్చే విధంగా విభిన్నంగా ఉండే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. దీంతో వారు స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలను ఎంపిక చేసుకున్నారు. ఈనెల చివరి వారం నుంచి ఎంపిక చేసిన మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ప్రారంభంకానున్నది. రాబోయే రెండు నెలల్లో ఎంపికచేసిన మహిళలందరికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.