కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాజాగా మరో వివాదం చుట్టుకున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన కౌన్సిలర్ ఒక మహిళకు కరోనా టీకా వేయడంపై బీజేపీ మండిపడింది. అసన్సోల్లో ఇటీవల మెగా కరోనా టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన స్థానిక టీఎంసీ కౌన్సిలర్ తబస్సుం అరా పక్కన డాక్టర్లు, నర్సులు ఉండగా ఒక మహిళకు స్వయంగా టీకా వేశారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఎలాంటి అనుభవం లేని వారు కరోనా టీకా వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆ పార్టీ నేతలు బాబుల్ సుప్రియో, అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. పాలక సభ్యులపై టీఎంసీకి నియంత్రణ లేనట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.
మరోవైపు టీఎంసీ కౌన్సిలర్ తబస్సుం అరా ఈ విమర్శలను ఖండించే ప్రయత్నం చేశారు. తాను గతంలో నర్సింగ్ కోర్సు చేశానని తెలిపారు. అయితే వాస్తవానికి తాను టీకా వేయలేదని, వేస్తున్నట్లు సిరంజిని మాత్రమే పట్టుకున్నానని చెప్పారు. టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో వారిలో భయాన్ని పోగొట్టేందుకు ఇలా చేసినట్లు ఆమె వెల్లడించారు.