హైదరాబాద్: షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. సోమవారం నాడు షాద్నగర్ డ్రైనేజీ పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కనీస రక్షణ చర్యలు లేకుండా పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి మీదపడటంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
షాద్నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డు చటాన్పల్లి, రాంనరగ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను చేసేందుకు ముగ్గురు కూలీలు వచ్చారు. లోతుగా తవ్విన కాలువలోకి దిగి సిమెంట్ పైపులను బిగిస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి ముగ్గరు కూలీలపై పడ్డాయి.
ఈ ప్రమాదంలో శ్రీను(38), కృష్ణయ్య(37) అనే ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతిచెందగా మరో కూలీ క్షేమంగా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ నేపథ్యంలోనే షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.