కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు చిత్రసీమలో తిరిగి షూటింగ్ల సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా చిత్రీకరణ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాల్ని సూచిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్టిస్టులతో పాటు పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన వారందరూ గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యతనివ్వాలని…వాటిని పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలు చేయాలని సూచించారు. షూటింగ్ తేదీలను కుదించుకొని వీలైనంత తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. చిత్రీకరణలో పాల్గొనే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులందరి నుంచి వ్యాక్సిన్ తీసుకున్నట్లు డిక్లరేషన్ను పొందాలని.. షూటింగ్కు హాజరయ్యే ప్రతి యూనిట్ సభ్యుడు ఖచ్చితంగా ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల్ని విధిగా పాటిస్తూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. అలాగే పరిశ్రమలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఉమ్మడి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.