సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): మారేడ్పల్లికి చెందిన ఓ మహిళ ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఉన్న తన ఖాతా నుంచి రూ.11,800 డ్రా అయ్యినట్లుగా ఆ మెస్సేజ్లో సారాంశం. ఆ డబ్బు ఆమె డ్రా చేయకపోవడంతో వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని భావించి, గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది. అందులో ఇండస్ ఇండ్ కస్టమర్ కేర్ నంబర్ అని ఉన్న ఓ నంబర్కు ఫోన్ చేసింది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మీ ఫిర్యాదును పరిశీలిస్తామంటూ నమ్మించాడు. ఆ తరువాత మీ సెల్ఫోన్లో ఇండస్ ఇండ్ బ్యాంకు యాప్ ఉందా అని అడిగాడు. లేదని సమాధానం రాగానే వెయిట్ చేయండి, మీకు కొన్ని నంబర్లు వస్తాయి.. వివరాలు చెప్పండంటూ నమ్మిస్తూ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. తరువాత అకౌంట్ను యాక్సెస్ చేసేందుకు బాధితురాలి ఫోన్కు బ్యాంకు నుంచి ఓటీపీలు వచ్చాయి. వాటిని బాధితురాలు సైబర్నేరగాడు అడగడంతో చెప్పేసింది. యాప్ను తన సెల్ఫోన్లో యాక్సెస్ చేసుకున్న సైబర్నేరగాడు ఆ ఖాతాలో ఉన్న రూ.4.28 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి, సాధారణ ఖాతాకు ఆ డబ్బును బదిలీ చేసుకున్నాడు. ఆ తర్వాత తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. బాధితురాలు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తు న్నారు.
మీ జియో నంబర్కు రూ.25 లక్షల లక్కీ లాటరీ తగిలిందంటూ ఓ బిటెక్ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.5.94 లక్షలు టోకరా వేశారు. నల్లకుంటకు చెందిన శ్రీరాంరెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు జియో లాటరీ వచ్చిందంటూ నమ్మించాడు. రూ.25 లక్షలు తీసుకోవాలంటే కొన్ని ట్యాక్స్లు చెల్లించాలంటూ సూచించాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు ముందుగా రూ.8200 చెల్లించాడు. ఆ తరువాత కూడా సైబర్నేరగాళ్లు ట్యాక్స్ల పేరు చెబుతూ నెమ్మదిగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. కొన్ని సందర్భాల్లో మీరు చెల్లించే డబ్బు కొంత తిరిగి వాపస్ వస్తుందంటూ నమ్మించారు. ఇలా.. మొత్తం రూ.5.94 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది.