న్యూఢిల్లీ: నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర సమతి మద్దతు ప్రకటించింది. ఈ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ బీమ్రావు బశ్వంతరావు పాటిల్ దీనిపై మాట్లాడారు. కరోనా మహమ్మారి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన సమయంలో.. కరోనా వారియర్స్ మనల్ని ఆదుకున్నట్లు తెలిపారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వేళ చాలా తక్కువ సదుపాయాలతో వారు సేవలు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తు మెడికల్ ఎమర్జెన్సీ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మెడికల్ విద్యను రెగ్యులేట్ చేస్తున్న రీతిలో ఈ బిల్లు ఉందన్నారు. హెల్త్కేర్ వర్కర్లలో ప్రొఫెషనలిజం తీసుకురావచ్చు అన్నారు. హెల్త్ ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేస్తూ బిల్లును రూపొందించినా.. దీని ద్వారా యావత్ దేశానికి లబ్ధి చేకూరుతుందన్నారు.
గతంలో శిక్షణ పొందిన డాక్టర్ల లేరని.. ఇలాంటి బిల్లుతో మేటి డాక్టర్లు తయారవుతారన్నారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలను మంజూరీ చేయాలని ఎంపీ బీబీ పాటిల్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలను మంజూరీ చేసినా.. దాంట్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్ ఇండస్ట్రీ.. ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ హిమాచల్లోని కసోలీలో ఉందని, లాజిస్టిక్స్ దృష్ట్యా మరో టెస్టింగ్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరారు. అందరికీ చౌకైన వైద్యాన్ని అందించాలని, హెల్త్కేర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు.