హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు, మా హైదరాబాద్ ఎడిటర్, టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ధర్మాసనం శ్రీధర్ (57) బుధవారం ఉదయం మృతి చెందారు. కొవిడ్ బారినపడ్డ ఆయనను గచ్చిబౌలిలోని టిమ్స్లో చేర్చారు. వెంలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన శ్వాసలో ఇబ్బంది ఏర్పడి తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం బన్సీలాల్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ధర్మాసనం శ్రీధర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో శ్రీధర్ క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీధర్ అకాల మరణం పట్ల మంత్రులు కే తారక రామారావు, ఈటల రాజేందర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నంగునూరి శేఖర్, విరాహత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.