వృద్ధులు, దివ్యాంగుల నుంచి పోస్టల్ బ్యాలెట్ల సేకరణ
ఇండ్ల వద్దకే వెళ్లి ఓట్లు సేకరించిన ఎన్నికల సిబ్బంది
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ రోగులకు ఎన్నికల కమిషనర్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అధికారులు బుధవారం భారీ భద్రత నడుమ వృద్ధులు, దివ్యాంగుల ఇండ్ల వద్దకే వెళ్లి పోస్టల్ బ్యాలెట్లను సేకరించారు. మూడు జిల్లాల పరిధిలోనూ 459 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్ బారిన పడిన రోగుల నుంచి గురు, శుక్రవారాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటును సేకరించనున్నారు. సుమారు100 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారని, కొవిడ్నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక కిట్లు ధరించిన సిబ్బంది వీరి నుంచి ఓటును స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.