కరోనా వైరస్ సెకండ్ వేవ్ గాలివేగంతో విజృంభిస్తోంది.. అగ్గిలా రాజుకుపోతోంది.. కుటుంబాలకు కుటుంబాలే క్వారంటైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.. గత సంవత్సరం వచ్చిన కరోనా ఫస్ట్వేవ్కు సెకండ్ వేవ్ పూర్తి భిన్నంగా ఉంది. ఫస్ట్వేవ్లో కుటుంబంలో భర్తకు వచ్చినా భార్యా పిల్లలకు రాలేదు. భార్యకు వస్తే భర్తకు రాలేదు. పిల్లల జోలికి వైరస్ పోయిన దాఖలాలు చాలా అరుదు. కుటుంబంలో ఎక్కువ శాతం ఒకరిద్దరే ఇన్ఫెక్ట్ అయ్యారు. కానీ.. ఇప్పుడున్న సెకండ్ వేవ్లో పరిస్థితి ప్రమాద గంటికలు మోగిస్తున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్లో వ్యాప్తి వేగం నిప్పులా రాజుకుంటుండటంతో కుటుంబంలో ఒకరికి వస్తే ఫ్యామిలీ మొత్తం వైరస్ బారిన పడుతున్నారు. ఈసారి పిల్లలను కూడా వదలడంలేదు. దీంతో వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, చికిత్స కేంద్రాల వద్ద కుటుంబాలకు కుటుంబాలే తరలివస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం గ్రేటర్లో యూకే వేరియంట్తో పాటు మహారాష్ట్రను వణికిస్తున్న డబుల్ మ్యుటేషన్ వైరస్ ప్రభావం వల్ల కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యూకే, మహారాష్ట్ర స్త్ట్రెయిన్లో (డబుల్ మ్యుటేషన్) వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని, ఫస్ట్ వేవ్ వైరస్లో ఒక వ్యక్తి సుమారుగా 10నుంచి 17మందికి వైరస్ను వ్యాప్తిచేస్తే… సెకండ్ వేవ్లో యూకే, డబుల్ మ్యుటేషన్ వైరస్లు సోకిన వ్యక్తి 30 నుంచి 50 మందికి వ్యాపింపచేయగలడని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు డాక్టర్ కిరణ్ మాడాల తెలిపారు. ఈ కారణం వల్ల వైరస్ ఒకరినుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుందని, ముఖ్యంగా ఇంట్లో ఒకరికి వచ్చినా అందరికీ ఇన్ఫెక్ట్ అవుతుందని ఆయన వివరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తా. సెకండ్ వేవ్లో వైరస్ పిల్లలను కూడా వదలడంలేదు. ఈసారి పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. పిల్లల ద్వారా పెద్దలు ఇన్ఫెక్ట్ అవుతున్నట్లు పలు కేసుల్లో బయటపడుతుంది. పిల్లలకు త్వరగా వైరస్ ఎటాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో లక్షణాలు త్వరగా బయటపడటంలేదు. కొంతమంది పిల్లల్లో అసలు లక్షణాలే కనిపించడంలేదు. పెద్దవారిలో లక్షణాలు బయటపడే వరకు పిల్లల్లో వైరస్ ఉన్నట్లు తెలియని పరిస్థితి చాలా కేసుల్లో కనిపిస్తుంది. పిల్లలను ఆడుకునేందుకు, చిన్న చిన్న పనులకోసం, పార్టీలు, వేడుకలు, తదితరాల కోసం పంపడం లేదా వెంట తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. బంధువులు, స్నేహితులను కొన్నిరోజుల వరకు ఇళ్లకు ఆహ్వానించకపోవడం ఉత్తమం. డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణులు, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన