నారాయణఖేడ్, ఏప్రిల్ 17:రోజురోజుకూ కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో కర్ణాటకకు వెళ్లే రాష్ట్ర సరిహద్దు రహదారులను మూసివేశారు. శనివారం నాగల్గిద్ద మండలంలోని కరస్గుత్తి, ఔదత్పూర్, మోర్గి గ్రామాల శివార్లలోని రాష్ట్ర సరిహద్దు వద్ద రోడ్లపై అడ్డంగా భారీకేడ్లను ఏర్పాటుచేసి ముళ్లకంచెలు వేశారు. కంగ్టి మండలంలోని దెగుల్వాడి, నాగూర్ (కె), సిద్ధంగిర్గ సమీపంలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలను నిరోధిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద దశలవారీగా రాకపోకలను నిలువరిస్తూ పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని అధికారులు యోచిస్తున్నారు.