హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తేతెలంగాణ): తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే వాటిలో మైక్రోగ్రీన్స్ పెంపకం ఒకటి. కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన, శ్రద్ధ పెరిగి ఆహారంలో ప్రొటీ న్లు, ఇతర పోషక విలువలు ఉండేలా జాగ్రత్తవహిస్తుండటంతో మైక్రోగ్రీన్స్ వినియోగం అధికమైంది. దీంతో చాలా మంది తమ ఇండ్లలోనే సొంతంగా మైక్రోగ్రీన్స్ పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఉపాధిగా మలుచుకొంటే నెలకు రూ.80 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. మైక్రోగ్రీన్స్ అంటే బ్రహ్మపదార్థాలేమీ కాదు. మనం నిత్యం వాడుకొనే విత్తనాలు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలకు చెందిన మొలకలే. వాటి విత్తనాలను మట్టిలో నాటితే కొద్ది రోజుల్లోనే చిన్న మొక్కలుగా పెరుగుతాయి. ఆ సమయంలో వాటిని సేకరించి, ప్యాకెట్లలో నిల్వచేసి సూపర్ మార్కెట్లతోపాటు పండ్లు, కూరగాయలు అమ్మేవారికి విక్రయిస్తే లాభాల పంటే.
మైక్రోగ్రీన్స్ పెంపకానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చిన్నపాటి ట్రేలు, పూలకుండీలు, వాడిపడేసిన పాల ప్యాకెట్లు, ఇతర వస్తువుల్లో మట్టి, వర్మి కంపోస్టు నింపి విత్తనాలను నాటి కొద్దికొద్దిగా నీరు పోస్తే సరి. దీం తో మొలకలు వచ్చి మొక్కలు పెరుగుతాయి. అవి చిన్న గా ఉండగానే సేకరించాలి. తర్వాత అదే మట్టిలో సేంద్రి య ఎరువులు వేసి మళ్లీ మైక్రోగ్రీన్స్ను పెంచవచ్చు. ఇందుకు అవసరమయ్యే ట్రేలు, కుండీలను పెట్టుకునేందుకు కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు.
మార్కెట్లో అందుబాటులో ఉండే గోధుమగడ్డి, పొద్దుతిరుగుడు, గుమ్మడి, ముల్లంగి, బీట్రూట్, ఆవాలు, మెంతులు, క్యాబేజీ, జీలకర్ర, వాము, పెసర్ల వంటి పలు రకాల విత్తనాలను మైక్రోగ్రీన్స్గా పెంచవచ్చు. వీటిని సేకరించిన తర్వాత ఆకులను తెంపి వాటిని ఆహార పదార్థాలపై చల్లుకుని అలాగే తినేస్తారు. మార్కెట్లో వీటి ధర కిలో రూ.1,000 వరకు పలుకుతున్నది. 10-10 అడుగుల సైజ్ ఉన్న చిన్నగదిలో మైక్రోగ్రీన్స్ను పెంచినా నెలకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలు, ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మైక్రోగ్రీన్స్ వినియోగం అధికంగా ఉంటున్నది.