వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
గద్వాల, మే 24 : కరోనా బాధితులకు మనోధైర్యమే మందని, వారిలో మనోనిబ్బరాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల దవాఖానలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దవాఖానను సందర్శించామని తెలిపారు. కరోనా వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని వెల్లడించారు. బాధితులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని కోరారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశకార్యకర్తలు, పోలీసులకు సమాజం రుణ పడిఉందని చెప్పారు. దవాఖానలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమంలో పాల్గొని రోగులకు అన్నదానం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం ఉన్నారు.