నగరానికి దీటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
సమస్యల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు.. వరద నీరు, ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటు..
నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు
అవసరమైతే రూ.3 వేల కోట్ల నిధులిచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ
రంగారెడ్డి, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. అందుకోసం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీఎస్ సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సమస్యల రహితంగా తీర్చిదిద్దనున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్, ముంపు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలను పక్కాగా రూపొందించనున్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి పనులు పూర్తయితే వచ్చే 50 ఏండ్లపాటు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలని, అందుకు అవసరమైతే రూ.3 వేల కోట్ల నిధులిస్తామని సీఎం హామీనివ్వడంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.
హైదరాబాద్ నగరానికి దీటుగా రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న జిల్లా సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం నగరమంతా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న దృష్ట్యా అభివృద్ధిని కూడా వికేంద్రీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లోని ప్రాంతాలకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్న దృష్ట్యా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే ఐదారేండ్లలో హైదరాబాద్ నగరం జిల్లాలోని మెజార్టీ ప్రాంతానికి విస్తరించనున్న నేపథ్యంలో ముందస్తు కిను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా సమగ్రాభివృద్ధికిగాను సీఎస్ ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు.
50 ఏండ్ల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు..
హైదరాబాద్ నగరంలో ఉన్న నాణ్యమైన వైద్యం, విద్యను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, నాలాల మరమ్మతు, విద్యుత్, రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వరద నీరు, ముంపు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కసారి పనులు పూర్తయితే మరో 50 ఏండ్లపాటు సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే రూ.3 వేల కోట్ల నిధులివ్వనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఏయే సమస్యలున్నాయనేది ఒక ప్రాజెక్టు రూపంలో తయారు చేయనున్నారు. సంబంధిత శాఖల అధికారులను భాగస్వాములను చేసి ఎంతమేర ఖర్చవుతుందని చర్చించనున్నారు.
సమగ్రాభివృద్ధికిగాను నెలకోసారి సీఎస్తో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు సమావేశమై పనుల పురోగతిపై చర్చించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూరగాయలు, మాంసం, చేపలను ప్రత్యేకంగా విక్రయించేందుకుగాను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడం, పటిష్టంగా రోడ్లను నిర్మించడం, మురుగునీటిని తొలిగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం వంటి పనులను చేపట్టనున్నారు. భారీ వర్షాలకు ముంపు సమస్యను అధిగమించేందుకు నాలాల మరమ్మతులను చేపట్టనున్నారు. జిల్లాలో మణికొండ, నార్సింగి, పెద్దఅంబర్పేట్, షాద్నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తుక్కుగూడ, ఆదిభట్ల, బడంగ్పేట్, ఆమనగల్లు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలు ఉండగా, మీర్పేట్, బండ్లగూడజాగీర్, జల్పల్లి కార్పొరేషన్లు ఉన్నాయి.
హైదరాబాద్కు దీటుగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి..
రానున్న రోజుల్లో హైదరాబాద్కు దీటుగా రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధి జరుగనున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించనున్నారు. 50 ఏండ్ల పాటు సమస్యలు ఉత్పన్నం కాకుండా పనులను చేపట్టనున్నారు. ఇందుకు ఎంత ఖర్చు అయినా ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది.