కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తోంది. ఇందుకనుగుణంగా జిల్లాలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఇకపై వైద్య బృందాలు ఇంటికే వెళ్లి కరోనా చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టనున్నాయి. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రతి వెయ్యి ఇండ్లకు ఒక బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వైద్య బృందాలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారు. అవసరమైన వారికి అక్కడికక్కడే మెడికల్ కిట్లను అందజేస్తారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానలకు తరలించి అత్యవసర చికిత్స అందించనున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానలు, సబ్ సెంటర్లలో ఓపీ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ అనితారామచంద్రన్ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కరోనాపై అవగాహన లేక కొందరు..నిర్లక్ష్యం, భయంతో మరికొందరు సకాలంలో చికిత్స తీసుకోవడం లేదు. తీరా.. రోగం ముదిరాక దవాఖానలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాకు ఆదిలోనే చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం బహుముఖ యుద్ధాన్ని చేపట్టేందుకు సంకల్పించింది. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్న బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోనూ అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. సీఎస్ సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో గూగూల్ మీట్లో సమీక్షించిన కొద్దిసేపటికే జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ వైద్యశాఖ అధికారులతో పాటు వివిధ శాఖలతో గూగుల్ మీట్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.. కొవిడ్ కిట్ల పంపిణీ తదితర వాటిపై పక్కా ప్రణాళికను రూపొందించి ఇంటింటి సర్వే నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.
నేటి నుంచే ఇంటింటికీ సర్వే బృందాలు
జిల్లాలో గురువారం నుంచే ఇంటింటికీ ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇందుకు సంబంధించి ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి వెయ్యి ఇండ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజూ నిర్దేశించిన ఇళ్లకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి జబ్బులతో పాటు కరోనా లక్షణాలు ఉంటే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. హోం ఐసొలేషన్లో ఉండి నయం అవుతుందనుకున్న వారికి అప్పటికప్పుడు హెల్త్ కిట్ అందజేసి సలహాలు, సూచనలు అందజేస్తారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని మాత్రం వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తారు. జిల్లా కేంద్రంలో కరోనా హెల్ప్లైన్ను సైతం ఏర్పాటు చేశారు. ఈ నంబర్కు ఫోన్ చేస్తే.. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు అత్యవసరమైన వారికి సాయం అందించేందుకు అధికారులు హుటాహుటిన చర్యలు తీసుకోనున్నారు. హెల్త్ కిట్లకు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచుతున్నారు.
కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించేందుకు చర్యలు
ఇప్పటివరకు మండల స్థాయిల్లోనే కొవిడ్ నివారణ చర్యలకు ఏర్పాట్లు చేయగా.. ఇక నుంచి గ్రామ స్థాయిలోనూ కొవిడ్ సంబంధిత వాటికి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్యం అవసరమైతే అందుకు తగ్గట్టుగా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానతోపాటు బీబీనగర్ ఎయిమ్స్, చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేట సీహెచ్సీలలో 150 వరకు బెడ్లను సిద్ధ్దం చేసి ఉంచగా..ఇందులో 65 వరకు ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచారు. వీటి సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నేటి నుంచి ఇంటింటి సర్వే
భువనగిరి కలెక్టరేట్ మే5: కరోనా నియంత్రణ కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. బుధవారం మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు, కోఆర్డినేటింగ్ అధికారులతో ఆమె గూగుల్మీట్ నిర్వహించి కరోనా కట్టడికి ఇంటింటి సర్వేపై మార్గదర్శకాలు వివరించారు. గత 4,5రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు తదితర ఇబ్బందులతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు ఇవ్వడంతో పాటు తగు వైద్య సహాయం అందించాలన్నారు. కరోనా లక్షణాలతో బాధపడే వారికి ముందుగా ధైర్యం చెప్పాలని, వ్యాధి తీవ్రతను బట్టి కొవిడ్ కేర్ సెంటర్లో చేర్పించి వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లో కొవిడ్ ఓపీ సేవలు వెంటనే ప్రారంభించాలని వైద్యాధికారులను కోరారు. సర్వే బృందాలు విధిగా ఎన్-95మాస్కులు ధరించి ఇంటింటా వివరాలు సేకరించాలని ఆదేశించారు. వెయ్యి ఇండ్లకు ఒక టీం చొప్పున ఇంటింటి సర్వే చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. గురువారం ఉదయం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. గూగుల్మీట్లో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పరిపూర్ణాచారి, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
సర్వేకు సహకరించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వేను నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. కరోనా అనుమానితులను గుర్తించి అవసరమైన మెడిసిన్ను ఇంటి వద్దనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. కరోనా బాధితులు వైద్య సాయం విషయంలో ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. సర్వేకు ప్రజలు సహకరించాలి.
-అనితారామచంద్రన్, జిల్లా కలెక్టర్