హైదరాబాద్ : ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకేసీఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా వెంటనే తయారుచేసి పెన్షన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆసరా పెన్షన్లు – వయోపరిమితి తగ్గింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలు అవుతున్న వివిధ పథకాలను మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం పెన్షన్లు పొందడానికి కనీస వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు రోజుల లోగా పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను అదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు.
ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలను 100% బతికే విధంగా ప్రత్యేక చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.
సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దయాకర్ రావు అదేశించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా : ఎమ్మెల్యే రాజయ్య