మహబూబ్నగర్: కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం నుంచి జూరాల ఆనకట్టపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రెండు రోజుల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్రతన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జలవిద్యుత్ కేంద్రాన్ని, జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్టు వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జూరాల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేశారు. పరిసర ప్రాంతాల వారిని, జూరాల మీదుగావెళ్లే వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న గేట్లకు తాళాలు వేశారు.
అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. సాగర్ బ్రిడ్జి వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్ద కూడా బందోబస్తు అధికం చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలతో బందోబస్సు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీశైలం డ్యాం ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసులు బందోబస్తు పెంచారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపుతున్నారు.