హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం దగ్గరలోని మంజీర నదిలో నలుగురు వ్యక్తులు మునిగి చనిపోయిన సంఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన స్పీకర్ అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు బీర్కూర్ మండలం సెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు నది దాటుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది నెలల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా.. గుంతల్లో పడి మునిగిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో తల్లీ పిల్లలు ఉన్నారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు.