హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ రెండో విడతలో భాగంగా ఆదివారం 60 వేల డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి. మే 1న తొలి విడత కింద 1.50 లక్షల డోసులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లోని రష్యా రాయబారి నికోలాయ్ కుదషేవ్ మాట్లాడుతూ.. కొవిడ్పై పోరులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. రష్యాలో 2020 ద్వితీయార్ధం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో టీకా మెరుగ్గా పనిచేస్తున్నదన్నారు. కరోనా కొత్తరకం వైరస్లపైనా ఈ టీకా పనిచేస్తుందని చెప్పారు. భారత్లో దీని తయారీని దశలవారీగా ఏడాదికి 85 కోట్ల డోసులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో భారత్లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
కొవిషీల్డ్, కొవాగ్జిన్తోపాటు భారత్లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ. భారత్లో దీని తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకున్నది. డాక్టర్ రెడ్డీస్కు తొలి విడతగా 1.5 లక్షల డోసుల ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్ ఈ నెల 1న చేరుకున్నది. వీటి పంపిణీకి హిమాచల్ప్రదేశ్లోని కసౌలిలో గల సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతినిచ్చింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘డాక్టర్ రెడ్డీస్’ ప్రారంభించింది. డాక్టర్ రెడ్డీస్లో కస్టమ్ ఫార్మా సర్వీసెస్ వ్యాపార విభాగ అధిపతి దీపక్ సప్రా తొలి ‘స్పుత్నిక్-వీ’ డోసు వేసుకున్నారు.