జిల్లాకు ఆక్సీజన్ కొరత తీర్చిన మంత్రి అజయ్
ఐటీసీ నుంచి రోజుకు 5 మెట్రిక్ టన్నులు
మంత్రికి కొవిడ్ బాధితుల నీరాజనాలు
ఖమ్మం జిల్లా వైద్యశాలలో ట్యాంకర్ను ప్రారంభించిన మంత్రి, కలెక్టర్, సీపీ
ఖమ్మం సిటీ, మే 13: జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సీజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. ప్రతిరోజు 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆక్సీజన్ ట్యాంకర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లిక్విడ్ ఆక్సీజన్ను ప్రతి రోజు తెప్పించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అందించేలా ఏర్పాటు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ను ప్రారంభించారు.
ఆయన ఏదైనా చెప్పారంటే క్షణం కూడా ఆలస్యం చేయరు. యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తారు. ఆయనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. జిల్లాలో ఆక్సీజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆయన ప్రకటించారు. సరిగ్గా ఐదు రోజుల వ్యవధిలోనే ఆ హామీని నెరవేర్చారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న మంత్రి.. స్వయంగా రంగంలోకి దిగి సారపాక ఐటీసీ యాజమాన్యంతో చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వేలాదిమంది భయం గుప్పిట్లో బతులీడుస్తున్నారని, సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. తద్వారా ప్రాణవాయువు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. ఇక నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ బాధితులకు అత్యవసరంగా అందిస్తున్న ఆక్సీజన్ను లేదని చెప్పడానికి వీల్లేకుండా చేశారు.
రోజుకు 5 మెట్రిక్ టన్నులు సరఫరా..
కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సీజన్ కొరత ఉందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆయా యాజమాన్యాలు కొవిడ్ బాధితులకు ఆక్సీజన్ ఏర్పాటు చేసినందుకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. సారపాక ఐటీసీ యాజమాన్యంతో చర్చించారు. జిల్లాలోని అన్ని కొవిడ్ దవాఖానలకు సరిపడే విధంగా రోజుకు 5 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆక్సీజన్ను ఖమ్మానికి సకాలంలో తీసుకువచ్చేందుకుగాను మంత్రి స్వయంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. గురువారం ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ట్యాంకర్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా కొవిడ్ బాధితులను వేధిస్తున్న ఆక్సీజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందున మంత్రి పువ్వాడకు జిల్లా ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు నీరాజనాలు పలుకుతున్నారు.
ప్రజా శ్రేయస్సే ముఖ్యం -మంత్రి అజయ్
జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఆ మహమ్మారి కాటుకు చాలామంది బలవుతున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళితే ఆక్సీజన్ లేదంటూ ప్రజల భయాందోళనలను రెట్టింపు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సీజన్ సరఫరా ట్యాంకర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సే తనకు ముఖ్యమని, ఆక్సీజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ కన్నుమూయకూడదనే ఏకైక లక్ష్యంతో భద్రాచలం ఐటీసీతో చర్చించానని చెప్పారు. కోరిన వెంటనే సానుకూలంగా స్పందించిన యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆక్సీజన్ లేదనే సమాధానం రాకూడదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి కొవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బీ శ్రీనివాసరావు, డాక్టర్ కే రాజశేఖర్గౌడ్, హాస్పిటల్ ఉద్యోగులు నందగిరి శ్రీను, ఆర్వీఎస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.