పానం ఎట్లుంటాంది.. జరాలేమన్న వస్తున్నయా?
గీ మందులు వేసుకోండి అంటూ ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది సూచనలు..
జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే రక్త శాంపిళ్లు సేకరించి పరీక్షలు, అవసరమైన మందులు సరఫరా.. మురుగు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ దోమల వ్యాప్తికి అడ్డుకట్ట.. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అందిస్తున్న వైద్యసేవల కారణంగా సీజనల్ వ్యాధులతో జిల్లాలో ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదు.
ఆదిలాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృ ష్టి సారించింది. జిల్లాలో గ్రామాలు, ఏజెన్సీ గూడేలు ఎక్కువగా ఉండటంతో వానకాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉండేది. కానీ, ఏటా సీజన్ ప్రారంభంలోనే అధికారులు పకడ్బందీ ప్రణాళికల తో వ్యాధులకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా లో 22 ప్రాథమిక ఆర్యోగకేంద్రాలు, 122 ఉప ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో 10 నుంచి 15 వేల మందికి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టారు.
పీహెచ్సీల్లో పనిచేసే సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఏటా జూలై నుంచి మూడు నెలలపాటు గ్రా మాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకొంటారు. ప్రతి ఇంటిపై ర్యాపిడ్ ఫీవర్ సర్వే (ఆర్ఎఫ్ఎస్) నంబర్ వేస్తారు. జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇతర సమస్యలు ఉన్నవారి రక్త శాంపిళ్లు సేకరిస్తారు. పరీక్షలు నిర్వహిస్తారు. జ్వరాలు వచ్చినవారికి అవసరమైన మందులిస్తారు. జిల్లాలో 172 ఏజెన్సీ గ్రామాల్లో 40,427 దోమతెరలను పంపిణీ చేశారు. వీటి ద్వారా 71,596 మందికి దోమల నుంచి రక్షణ కలుగుతున్నది. 20 ప్రత్యేక బృందాలు గ్రామాల్లో నీటి నిల్వలు, దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తాయి.
వానకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి రా ష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలతోపాటు మారుమూల పల్లెల ప్రజలు సీజనల్ వ్యాధులతో వణికిపోయేవారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందక చనిపోయేవారు. కానీ, తెలంగా ణ ప్రభుత్వం ఆదిలాబాద్ ప్రజల్లో ఉన్న రోగాల భయాన్ని పోగొట్టి భరోసా ఇచ్చింది.
పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లాలో మలేరియా, డెంగీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 54 మలేరియా ప్రభావిత గ్రామాల్లో సర్వే చేపట్టి 10,281 రక్త నమునాలు సేకరించి పరీక్షలు నిర్వహించాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా నిర్వహిస్తున్నాం. పంచాయతీ, మున్సిపల్శాఖల సిబ్బందితో క్రమంగా సమావేశాలు నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
–డాక్టర్ శ్రీధర్ మిట్పెల్లివార్, ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి