మద్దూరు, జూన్ 4: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన పరిశోధనలో 13వ శతాబ్దానికి చెందిన వివిధ శిల్పాలు, తెలుగు లిపి ఆధారాలు లభించాయి. లభ్యమైన శిల్పాల్లో ప్రధానంగా శైవభక్తుల ఆత్మాహుతి శిల్పముంది. ఇద్దరు వీరభక్తులు ఆత్మాహుతికి సిద్ధపడి ఎదురెదురుగా నిలబడి, ఆరోహణం చేయబోయే శూలాలను పట్టుకొని నిల్చున్నారు. ఇటీవల మునిగడపలో శూలారోహణం చేసి ఆత్మసమర్పణ చేసిన వీరభక్తుని శిల్పం బయటపడింది. సిద్దిపేట భోగేశ్వరాలయ ప్రాంగణంలో, బమ్మెరలో ఇలాంటి ఆత్మాహుతి వీరశిలలు కన్పించాయి. గాగిళ్లాపూర్లోని ఈ శిల్పాలు కూడా వీరగల్లులో చేర్చదగిన ఆత్మాహుతి వీరశిలలే. మరోచోట రాతిఫలకం మీద చెక్కిన యుద్ధవీరుడి శిల్పముంది. తలమీద సిగముడి, వీరకాసే, దక్షిణాభిముఖుడైన వీరుడు డాకాలు ముందుంచి రెండు చేతులతో శూలాన్ని పట్టుకొని శత్రువుమీద దాడి చేస్తున్నట్టు చెక్కి ఉన్నది ఈ వీరగల్లు విగ్రహం. ఈ వీరగల్లు మీద లఘు శాసనం ఉన్నది. లిపిని బట్టి ఇది 13వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా ప్రస్ఫుటమవుతుంది. వీరుని వేషభాషలు కూడా కాకతీయుల కాలంనాటివని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఈ లఘు శాసనంలో ‘శ్రీ ప్రలోబదేవి.. గోమటయ’ అని ఉన్నది. వీరగల్లులోని వీరుని పేరు గోమటయ అని తెలుస్తున్నదని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు సామలేటి మహేశ్, శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.