హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ సంస్థల చేనేత/ఖాదీ ఉత్పత్తులను ప్రదర్శించడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ చేనేత వస్త్రాల స్టాళ్లు కొలువుదీరాయి. సికింద్రాబాద్, కాచిగూడలో ఆగస్టు 22 వరకు, హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగస్టు 19 వరకు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలుదారులు ఈ స్టాళ్లను సందర్శించి కొనుగోలు చేయవచ్చు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్మరించుకొని, ఆత్మనిర్భర్ భారత్ భావనను చిత్రీకరించే క్రమంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 75 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఈ స్టాల్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.