హైదరాబాద్: దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ప్రెస్ (02450) ప్రతి శుక్రవారం.. ఈ నెల 11, 18, 25, జూలై 2న నడుస్తుందని తెలిపింది. అదేవిధంగా షాలిమార్-సికింద్రాబాద్ (02449) రైలు ప్రతి బుధవారం.. ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. హౌరా-యశ్వంత్పూర్ రైలు (02469) ప్రతి గురువారం అంటే… ఈ నెల 10, 17, 24 తేదీల్లో, యశ్వంత్పూర్-హౌరా రైలు (02470) ప్రతి ఆదివారం అంటే… ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తాయన్నారు. ఇవన్నీ రిజర్వేషన్ రైళ్లేనని తెలిపారు. కాగా, ప్రతి గురువారం నడిచే పట్నా-బన్సావాడి రైలు (03253)ను ఈ నెల 10 నుంచి, ప్రతి ఆదివారం నడిచే బన్సావాడి-పట్నా రైలు (03254)ను ఈ నెల 13 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.