హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తప్పుడు లెక్కలు.. తప్పుడు మాటలు.. సాక్షాత్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో సైతం మసిపూసి మారేడుకాయ చేయాలన్న యత్నం. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నీటిప్రవాహంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ప్రధానికి రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే.. అబద్ధాలు.. అవాస్తవాలను ప్రచారంచేసి కేంద్రం సానుభూతిని పొందాలన్న ఉద్దేశం తప్ప మరేమీ కనిపించడంలేదని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టులో నిర్మించిన పోతిరెడ్డిపాడు అనేదే కుట్రపూరితంగా కట్టిందన్నది అందరికీ తెలిసిందే. ఈ అక్రమ ప్రాజెక్టునుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్తున్న నీటి ప్రవాహం విషయంలోనూ పచ్చి అబద్ధాలను ఏపీ ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి మన వాటా జలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టుపట్టిన నేపథ్యంలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పోతిరెడ్డిపాడు నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహ సామర్థ్యాన్ని నిర్ధారించేలా ‘టెలిమెట్రీ’ పరికరాలను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. టెలిమెట్రీని ఏర్పాటుచేస్తే.. తమ జల దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని.. చాలాకాలం పాటు దీనిని ఏర్పాటు చేయకుండా.. ఏపీ కుతంత్రాలు చేసింది. ఎట్టకేలకు టెలిమెట్రీ ఏర్పాటు చేసినా.. అదీ పోతిరెడ్డిపాడుకు 12 కి.మీ దూరంలో ఏర్పాటుచేసింది. అదికూడా చాలాకాలంపాటు సరిగా పనిచేయకుండా చూసింది. ఇదంతా ఎందుకంటే.. నీటి ప్రవాహం ఎంతమేర ఉన్నదనే వాస్తవం బయటకు రాకుండా ఉండేందుకే. ఏపీ సీఎం జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాజాగా రాసిన లేఖలో పేర్కొన్న తప్పుడు అంకెల గారడీని చూద్దాం.
అబద్ధం:
854 ఫీట్ల స్థాయికి నీరు చేరుకుంటేనే గ్రావిటీ ద్వారా కనీసం 6000 క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా విడుదలవుతుంది.
నిజం: వాస్తవానికి పోతిరెడ్డిపాడును 841 ఫీట్ల (సిల్ట్) వద్ద నిర్మించారు. అంటే 841 ఫీట్లకు పైన ఎంత నీరు వచ్చినా.. గ్రావిటీ ద్వారా కాలువలోకి పోతూనే ఉంటుంది. తరువాత పెరిగే నీటి మట్టాన్ని బట్టి నీటి ప్రవాహ వేగమూ పెరుగుతుంది. తెలంగాణ జల నిపుణుల అంచనాప్రకారం.. 841.5 ఫీట్ల వద్ద 9 తూముల నుంచి 507 క్యూసెక్కులు, 14 తూముల నుంచి 789 క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళుతుంది. 854.7 ఫీట్ల వద్ద 9 గేట్ల ద్వారా 8,263 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. అదే 14 గేట్ల ద్వారా వెళ్లే నీటిని గణిస్తే.. 12,854 క్యూసెక్కులు అవుతుంది.
అబద్ధం: 881 ఫీట్ల వరకు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు పూర్తి సామర్థ్యం అయిన 44,000 క్యూసెక్కుల నీరు వెళ్ళగలదు.
నిజం: ఇది కూడా పూర్తిగా అబద్ధం. వాస్తవానికి పోతిరెడ్డిపాడు వద్ద మొత్తం 14 తూములున్నాయి. మొదట్లో తవ్విన 4 తూములు, (3+1) ఆ తరువాత వైఎస్ హయాంలో తవ్విన 10 తూములు (9+1) ఉన్నాయి. నిజానికి పాత తూములు నాలుగింటిని మూసివేయాలి. అలా కాకుండా.. పాతవి నాలుగింటిని అలాగే ఉంచి.. కొత్తగా తవ్విన 10 తూముల నుంచి.. అంటే మొత్తం 14 తూముల నుంచి నీటిని తరలించుకుపోతున్నారు. ఈ విషయాన్ని జగన్ తన లేఖలో చెప్పలేదు. ఎన్ని తూముల నుంచి నీటిని తరలిస్తే.. 44 వేల క్యూసెక్కులు అవుతుందనేదికూడా స్పష్టంగా చెప్పకుండా తప్పుదారి పట్టించారు. నిజానికి తెలంగాణ జల నిపుణులు వేసిన అంచనాలను బట్టి.. 880.9 ఫీట్ల వద్ద 9 తూముల నుంచి మాత్రమే.. 42,959 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉంటుంది. అదే 14 తూముల నుంచి ఆ నీటి ప్రవాహం సాగితే, ఏకంగా 67,936 క్యూసెక్కులు ఉంటుందన్నమాట. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) 885 ఫీట్ల వరకు నీటిమట్టం ఉంటే గనుక.. 9 తూముల నుంచి సుమారు 45,000 క్యూసెక్కుల నీరు వెళ్ళే అవకాశం ఉండగా.. అదే 14 తూముల నుంచి ఏకంగా 70 వేల క్యూసెక్కుల ప్రవాహానికి అవకాశం ఉంటుంది.
ఇలా తప్పుడు సమాచారంతో, అబద్ధపు గణాంకాలతో ఏపీ సీఎం వైఎస్జగన్ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖపై తెలంగాణ జల నిపుణులు మండిపడుతున్నారు. తన లేఖలో తాము 9 తూముల ద్వారా తీసుకెళతామా.. 14 తూముల ద్వారా తీసుకెళతామా అనేది ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్కో తూము నుంచి ఎంత మొత్తంలో నీటి ప్రవాహం వెళ్ళేలా డిజైన్ చేశారు.. ఎంతమేర వెళ్ళేలా నిర్మించారనే వాస్తవాలు చెప్పి ఉంటే, తాము అక్రమంగా ఎంత నీటిని తరలిస్తున్నామో లేఖలో పేర్కొని ఉంటే మరింత బాగుండేదంటూ తెలంగాణ జల నిపుణులు ఎద్దేవాచేస్తున్నారు.
తెలంగాణ జల నిపుణుల అంచనాల మేరకు.. పోతిరెడ్డిపాడు నుంచి ఏయే నీటిమట్టాల వద్ద.. ఎన్ని గేట్ల ద్వారా ఎంత నీటి ప్రవాహ సామర్థ్యం ఉంటుందనేది ఇలా ఉంది..!