హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూలై ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు తదితర అన్నిరకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పూర్తిస్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. ఈ విషయంలో అయోమయానికి ఎటువంటి తావులేదని పేర్కొన్నది. విద్యాసంస్థలు భౌతికంగానే పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు, తప్పనిసరి హాజరుకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలపై పూర్తిస్థాయి ఆదేశాలను విడుదలచేయాలని విద్యాశాఖను క్యాబినెట్ ఆదేశించింది. క్యాబినెట్ నిర్ణయంతో ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో విద్యాబోధన ప్రారంభం కానున్నది.
ఒకటో తరగతి నుంచే ఆన్లైన్!
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన ఆదివారం పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య తదితర అన్ని విభాగాధికారులతో సమావేశం జరుగనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో విద్యాసంస్థల ప్రారంభానికి పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖరారుచేయనున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులు మూడో తరగతి నుంచి కొనసాగుతుండగా, ఒకటో తరగతి నుంచే ప్రారంభించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. టీశాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అందించనున్నారు.
హాజరు తప్పనిసరి..
ఈ ఏడాది హాజరు తప్పనిసరి చేయనున్నారు. విద్యార్థులంతా తరగతులకు హాజరుకావాల్సిందే. విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు కచ్చితంగా పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈసారి కూడా విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరు కావాలంటే వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తేవటం తప్పనిసరిచేసే అవకాశం ఉన్నది. ఒక్కో విద్యాసంస్థలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమందికి భౌతిక బోధన చేయాలి? ఎవరికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారుచేస్తారు. విద్యార్థులు మాత్రం ఏదో ఒక విధానంలో తరగతులకు హాజరుకావటం తప్పనిసరిచేయనున్నారు. విద్యార్థులు నష్టపోరాదని, చదువులలో వెనుకబడరాదని భావించిన సర్కారు ఈ ఏడాది ఆలస్యం కాకుండా తరగతుల నిర్వహణకు అనుమతినిచ్చింది. పాఠశాలలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సంఘాలు స్వాగతించాయి.