హైదరాబాద్: స్కూళ్ల గేట్లు తెరుచుకున్నాయి.. మళ్లీ బడి గంటలు మోగాయి.. పిల్లలు స్కూళ్ల బాటపట్టారు. ఇక క్లాస్ రూముల్లో సందడి మొదలైంది. నేరుగా పాఠాలు నేర్చుకునేందుకు చిన్నారులు బడులకు వస్తున్నారు. ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు పాఠశాలలు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్ స్కూల్కు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. మాస్క్లు ధరించిన విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. కొన్ని చోట్ల స్కూల్ సిబ్బంది విద్యార్థులను శానిటైజ్ చేశారు. 16 నెలలుగా పాఠశాలలకు దూరంగా ఉన్న పిల్లలకు ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టారు. దీంతో స్కూళ్లలో ఆనందకర వాతావరణం నెలకొన్నది. క్లాసు రూమ్లో ఉండే ఆనందాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.
తెలంగాణలో గురుకులాలు, హాస్టళ్లు మినహా అన్నింటా ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇంటర్, డిగ్రీ కాలేజీలు కూడా ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాయి. ఇంటర్ విద్యార్థులు అవసరమైతే యూట్యూబ్ పాఠాలు వినవచ్చు అని విద్యాశాఖ పేర్కొన్నది. సిటీలోని కొన్ని స్కూళ్లు మరికొన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్కూళ్లు ప్రత్యక్ష తరగతుల కోసం తెరుచుకున్నాయి. సిటీలోని రాజ్భవన్ స్కూల్ను గవర్నర్ తమిళసై సందర్శించారు.
కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఇన్నాళ్లూ బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ ఉదృతి వల్ల చాలా వరకు విద్యాసంస్థలను నూరు శాతం మూసివేశారు. ఆన్లైన్లోనే చాన్నాళ్ల పాటు విద్యను బోధించారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువులన్నీ ఆన్లైన్లోనే సాగాయి. అయితే కరోనా క్రమంగా బలహీనమవుతున్న నేపథ్యంలో మళ్లీ స్కూళ్లను తెరువాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారమే ఇవాళ్టి నుంచి స్కూళ్లను ప్రత్యక్ష తరగతుల కోసం ప్రారంభించారు.
మరో వైపు ఆర్టీఏ అధికారులు ఇవాళ నగరంలో 12 పాఠశాలల బస్సులను సీజ్ చేశారు. బస్సులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. డాక్యుమెంట్లు సరిగాలేని వాహనాలను సీజ్ చేశారు.