హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు జోరందుకుంటున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు విద్యార్థులు ఇష్టం చూపుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలుగు మీడియంలో 11 లక్షల మంది విద్యార్థులుండగా, ఇంగ్లిష్ మీడియంలో 12 లక్షల పైచిలుకు విద్యార్థులున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించగా, ఈ విషయం వెల్లడయ్యింది. తెలంగాణవ్యాప్తంగా 8 మాధ్యమాల్లో విద్యాబోధన కొసాగుతున్నది. పక్కరాష్ర్టాల నుంచి వలసవచ్చి స్థిరపడిన విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వమే ప్రత్యేకంగా స్కూళ్లను నెలకొల్పింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీతో పాటు, బెంగాలీ, కన్నడ, మరాఠీ, కన్నడ, తమిళ మాధ్యమాల్లో బోధన కొనసాగుతున్నది. వీటన్నింటిలో ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం పెరుగుతుండటం, ప్రైవేట్ స్కూళ్ల నుంచి పోటీ ఎదురవటంతో నాలుగేండ్ల క్రితమే ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను నెలకొల్పారు. తత్ఫలితంగా ఇంగ్లిష్ మీడియం వైపే విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఫీజులు భరించలేక మరికొంతమంది విద్యార్థులు సర్కారు స్కూళ్ల బాట పడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా దాదాపు 3 లక్షల మంది సర్కారుబడుల్లో చేరుతారని భావిస్తున్నారు.
పాఠ్యపుస్తకాలూ..
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పాఠ్యపుస్తకాల సంఖ్య సైతం అధికమవుతున్నది. ఈ ఏడాది ముద్రిస్తున్న పాఠ్యపుస్తకాల్లో సైతం ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలే అధికంగా ఉన్నాయి. విద్యార్థుల ప్రవేశాలను బట్టే పాఠ్యపుస్తకాల ముద్రణను చేపడుతుండగా, ఈ ఏడాది తెలుగు మీడియం పుస్తకాలను మించి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను ముద్రిస్తున్నారు. 2021-22లో 8 మాధ్యమాలను కలుపుకొని మొత్తం 1.43 కోట్ల ఉచిత పాఠ్యపుస్తకాలను ముద్రించనుండగా, అత్యధికంగా ఇంగ్లిష్ మీడియం పుస్తకాలే ఇవ్వనున్నారు.
మీడియం విద్యార్థులు
ఇంగ్లిష్ 12,73,463
తెలుగు 11,66,111
ఉర్దూ 1,08,381
బెంగాలీ 236
హిందీ 2,445
కన్నడ 1,464
మరాఠీ 2,223
తమిళం 111
మొత్తం 25,54,434