హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులను తరగతి గదులకు అనుమతించారు. మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కోనరావుపేట మండల వ్యాప్తంగా స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు.. విద్యార్థుల ఉష్ణోగ్రతలు పరిశీలించి, శానిటైజర్ ఇచ్చిన తర్వాత తరగతిలోకి అనుమతించారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని సురారం కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ నిబందలను పాటిస్తూ విద్యార్థులు వచ్చారు. తరగతిగదిలో నియమాలను పాటించాలని సైన్ బోర్డులు, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో పాఠశాలలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మల్యాలో ఉన్న జూనియర్ కాలేజీని తోరణాలతో ముస్తాబు చేశారు.
మహబూబాబాద్ జిల్లా గుమ్ముడూరు మండలంలోని బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అందంగా అలంకరించారు. కొబ్బరి, అరటి ఆకులతో తోరణాలు కట్టి స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ పట్టణంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కమిషనర్ విద్యార్థులకు గులాబీ పూలు అందించారు.