హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): అకారణంగా, సెలవులు పెట్టకుండా విధులకు డుమ్మా కొట్టిన టీచర్లపై కొరడా ఝళిపించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నది. ఆయా టీచర్లపై సీసీఏ రూల్స్, లీవ్రూల్స్ అండ్ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోబోతున్నది. 2005 జనవరి 1 నుంచి 2021 జూలై వరకు విధులకు హాజరుకాని టీచర్ల వివరాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలను ఆదేశించారు. సమాచారం ఇవ్వకుండా చాలామంది టీచర్లు విధులకు డుమ్మా కొడుతున్నట్టు గుర్తించిన విద్యాశాఖ అధికారులు డీఈవోల నుంచి వివరాలు తెప్పించుకోగా ప్రస్తుతానికి 156 మంది తేలారు. వీరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఈవోలను ఆదేశించారు. ఇంకా ఎంతోమం ది ఉన్నట్టు పరిశీలనలో తేలటంతో వారి వివరాలపై ఆరాతీసి పూర్తి సమాచారాన్ని పంపాలని మంగళవారం ప్రొసీడింగ్స్ను జారీచేశారు. నిబంధనల ప్రకా రం టీచర్లు ఏడాదిపాటు గైర్హాజరైతే రాజీనామా చేసినట్టు లెక్క. కానీ 10-15 ఏండ్ల వరకు సెలవులు పెట్టకుండా, సమాచారమివ్వకుండా విధులకు రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు 15 ఏండ్లపాటు విధులకు డుమ్మా కొట్టారు. నోటీసులిచ్చినా స్పందించ లేదు. అదే టీచర్కు ఇప్పుడు మళ్లీ నోటీసులిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఓ టీచర్ దుబాయ్, సౌదీ అరేబియాకు వెళ్లి టీచర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆమెకు నోటీసులిచ్చినా స్పందించటం లేదు. హైదరాబాద్ జిల్లాలోనే మరో ఉపాధ్యాయురాలు సెలవు పెట్టకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా 9 ఏండ్ల నుంచి పత్తాలేకుండా పోయారు.
హైదరాబాద్లో 10, జోగులాంబ గద్వాల 4, మహబూబాబాద్ 16, రంగారెడ్డి 25, కామారెడ్డి 2, నిజామాబాద్ 2, సూర్యాపేట 2, ఖమ్మం 4, జయశంకర్భూపాలపల్లి 1, వరంగల్ అర్బన్ 4, వరంగల్ రూరల్ 2, మేడ్చల్ 2, యా దాద్రి భువనగిరి 9, రాజన్న సిరిసిల్ల 4, సిద్దిపేట 9, పెద్దపల్లి 3, నిర్మల్ 4, నాగర్ కర్నూలు 4, మంచిర్యాల 5, జగిత్యాల 6, కరీంనగర్ 13, ములుగు 1, నారాయణపేట 2, జనగామ 6, భద్రాద్రి కొత్తగూడెం 2, ఆదిలాబాద్ 4, న ల్లగొండ 2, ఆసిఫాబాద్ 3, సంగారెడ్డిలో ఐదుగురు టీచర్లు.