హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రుల్లో రూ.71 కోట్ల వ్యయంతో వసతులు కల్పించినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఉద్యోగాల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇతర పబ్లిక్ సెక్టార్లకు సింగరేణి మేనేజ్మెంట్ ఆదర్శంగా నిలిచింది.
కొవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవలకు, కరోనా వ్యాప్తి నివారణకు ఎస్సీసీఎల్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 1.27 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో పాటు ఉద్యోగులకు 27 వే వ్యాక్సిన్లు అందించింది. ఏరియా ఆసుపత్రులలో 1,400 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సేకరించడమే కాకుండా హైదరాబాద్, ఇతర ఎంపానెల్ ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలను విస్తరించింది.
సింగరేణి ఐదు ప్రదేశాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 1.25 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రూ .3.16 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. మొత్తం 99,406 మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో 12,308 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 9,938 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 2,267 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణిలో వర్కర్స్ మొత్తం 44 వేలు. వీరిలో కేవలం 783 మంది మాత్రమే కొవిడ్ బారిన పడ్డారు. మిగతా వారు వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఉద్యోగులకు ప్రత్యేక మెడికల్ సర్వీసుల నిమిత్తం మేనేజ్మెంట్ రూ.38 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇలా 42 మందిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు.
ప్రత్యేక కొవిడ్ వార్డుల ఏర్పాటుకు రూ.43 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్యారంటైన్ సెంటర్లలో లేదా ఇళ్లలో చికిత్స పొందుతున్నవారికి మందులు, ఆక్సిమీటర్ వంటి 18 రకాలతో కూడిన కిట్స్ను అందజేస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణివ్యాప్త ఆస్పత్రులకు రెమ్డెసివిర్, ఫావిపిరవిర్ టాబ్లెట్స్, ఇతర మందులను రూ.5.55 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆక్సిజన్ సేకరణకు, అదనపు వైద్య సిబ్బంది నియామకానికి రూ.1.28 కోట్లు ఖర్చుచేశామన్నారు. దురదృష్టవశాత్తు కొవిడ్-19తో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి కంపెనీ రూ.15 లక్షల నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు.