కుత్బుల్లాపూర్, మే 31 : ఇద్దరు బాలికలు చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి గ్రామం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సంజన(13), కరీనా(12) సాయంత్రం సమయంలో గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. కాగా చెరువు గట్టుపై బాలికల దుస్తులు, చెప్పులు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాదవశత్తు జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు చెరువులో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటనలో సంజన మృతదేహాం లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో విరమించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.