హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్తోపాటు ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేట్ దవాఖానలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్ చేసిన తీరును న్యాయస్థానానికి వివరించారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని, అరికాళ్లకు తగిలిన గాయాలను మేజిస్ట్రేట్కు ఆయన చూపించారని తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఉన్నందున తమకు అభ్యంతరం ఉన్నదని, ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని రఘురామ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో పరీక్షలు ఆర్మీ దవాఖానలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు ఒక న్యాయాధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, నివేదికను సీల్డ్కవర్లో అందించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.